అన్నకు నిప్పంటించిన తమ్ముడు

16 May, 2019 08:30 IST|Sakshi

చెన్నై : కోడికూర అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. కూర తక్కువగా వడ్డించడంలో గొడవ జరగడంతో అన్నపై తమ్ముడు కిరోసిన్‌ కుమ్మరించి నిప్పటించాడు. వివరాలు.. కారైకుడి సమీపానగల సూరైకుడి ప్రాంతానికి చెందిన రాజు భార్య మీనాళ్‌. వీరికి ప్రతాప్‌ (24), ప్రదీష్‌ (21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతాప్‌ అదే ప్రాంతంలోని సెలూన్‌ షాపులో పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉంది. మంగళవారం వారి ఇంట్లో కోడికూర చేశారు.

మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లిన ప్రతాప్‌ మళ్లీ రాత్రి భోజనం చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనికి కోడికూర తక్కువగా వడ్డించినట్లు సమాచారం. దీంతో అతను ప్లేటును గాల్లోకి విసిరాడు. దీన్ని తమ్ముడు ప్రదీష్‌ నిలదీశాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. తర్వాత ప్రదీష్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన ప్రదీష్‌ వాకిట్లో నిద్రిస్తున్న ప్రతాప్‌పై కిరోసిన కుమ్మరించి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి రాజు, తల్లి మీనా, స్థానికులు బాధితుడిని కారైకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన సెట్టినాడు పోలీసులు, ప్రదీష్‌ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు