సాక్షి, పులివెందుల: ప్రేమించిన యువతి కోసం పరితపించాడు. ఎలాగైనా ప్రేయసిని దక్కించుకోవాలనుకున్నాడు. ఇంటి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించలేదని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని కనిపించాడు. వివరాలలోకి వెళితే.. పులివెందుల పట్టణానికి చెందిన గంగిరెడ్డి కృష్ణారెడ్డి, కళావతిల కుమారుడు మహేశ్వరరెడ్డి డిగ్రీ చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అతను కనిపించలేదు. తల్లిదండ్రులు పట్టణంలోని అర్బన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అంతేకాక స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు సైతం లేఖల ద్వారా తెలియజేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అతడు అనంతపురం పట్టణంలో ఉన్నాడని తెలిసింది. పులివెందుల పట్టణానికి మీరా కుమారిని వివాహం చేసుకొన్నాడు. పోలీసులు శనివారం వారి ఇద్దరిని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి యువకుడి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ సీతారాంరెడ్డి మాట్లాడుతూ అర్జీదారులు వాస్తవాలను మాత్రమే ఫిర్యాదు చేయాలని.. అలా కాకుండా అవాస్తవాలను ఫిర్యాదు చేసి పోలీసుల పనితీరును శంకించరాదన్నారు.