చెన్నై: మాంత్రికుడి మాటలు నమ్మి కన్నబిడ్డ పట్ల కర్కశకంగా ప్రవర్తించాడో దుర్మార్గపు తండ్రి. మృగంలా మారి ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. పుదుకొట్టై జిల్లాకు చెందిన పనీర్సెల్వంకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే కొడుకు లేడనే బాధ అతడిని మెలిపెడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల అతడికి పరిచయమైన ఓ మాంత్రికుడు.. కూతుర్ని బలిస్తే.. కొడుకు పుడతాడని చెప్పాడు. అంతేగాక ఆమె చావుతో ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరతాయని నమ్మబలికాడు.(దొంగల దాడిలో మహిళ మృతి)
ఆ మాంత్రికుడి మాటలు నమ్మిన పనీర్సెల్వం.. కూతురిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మే 18న ఇంటికి సమీపంలో ఉన్న బావి నుంచి నీళ్లు తోడుకు వచ్చేందుకు వెళ్లిన బాధితురాలి(13)ని తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ క్రమంలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తొలుత అత్యాచారం కేసుగా అనుమానించారు. అనంతరం తమదైన శైలిలో విచారణ జరుపగా... పనీర్సెల్వమే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అతడిని అరెస్టు చేశారు. (ప్రాణం తీసిన వివాహేతర బంధం)