మత్తు మందు ఇచ్చి యువతిపై అత్యాచారం

13 Jul, 2018 07:50 IST|Sakshi

క్రికెట్‌ ఆడేందుకు వచ్చి లోబర్చుకున్న వైనం

ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులు

పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడు

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ) : స్కూల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడు సమీపంలోని యువతిపై కన్నేశాడు. మంచినీళ్లు కావాలని పలు మార్లు మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు.. మంచివాడిగా నటిస్తూ తన ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులను పరిచయం చేస్తానన్నాడు... నమ్మి ఇంటికి వెళ్లిన యువతికి మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు... విషయం బయటకు చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో చోటు చేసుకుంది. స్థానికంగా ఓ స్కూల్‌లో పనిచేస్తున్న యువతి (20) తన అన్నయ్యతో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. అన్నయ్య మానసిక పరిస్థితి సరిగా ఉండదు.

చిట్టినగర్‌ దుర్గాసి రాములు వీధికి చెందిన పొట్నూరి లక్ష్మణ్‌  స్నేహితులతో కలిసి స్కూల్‌ గ్రౌండ్‌కి క్రికెట్‌ ఆడేందుకు వచ్చేవాడు. క్రికెట్‌ ఆడే సమయంలో లక్ష్మణ్‌  స్కూల్‌ ఆవరణలో ఉండే యువతిని  గమనించాడు. ఆమెతో మాటలు కలిపేందుకు పదే పదే మంచినీళ్లు కావాలని అడిగే వాడు. చివరకు యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించి ఫోన్‌ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. నమ్మకంగా ఉండటంతో లక్ష్మణ్‌తో యువతి మాట్లాడేది... ఒక రోజు ఆమెను తన ఇంటికి రావాలని, తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి నమ్మించాడు. బైక్‌పై ఇంటికి తీసుకు వెళ్లగా... ఇంట్లో అందరూ బయటకు వెళ్లారని చెప్పి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడమే కాకుండా సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. అంతే కాకుండా యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అప్పటి నుంచి పలు మార్లు బైక్‌పై పార్కుకు, సినిమాలకు, ఆలయాలకు తిప్పేవాడు..అయితే రెండు నెలల కిందట యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అప్పటి నుంచి లక్ష్మణ్‌ తప్పించుకుని తిరగడమే కాకుండా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. అతని స్నేహితులను ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు గురువారం కొత్తపేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు  వెంటనే నిందితుడి కోసం వెతకటం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు