ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు

4 Jul, 2018 15:13 IST|Sakshi

భోపాల్‌ : ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే​ యువకులే ఎక్కువగా ఉన్నారు. ప్రేమించలేదంటూ యాసిడ్‌ దాడులు, ప్రాణాలు తీస్తున్న జనరేషన్‌ ఇది. కానీ ఇప్పటికీ నిజాయితీగా ప్రేమించేవారు ఉన్నారని నిరూపించాడు ఓ యువకుడు. తన స్వచ్ఛమైన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రాణాలే త్యాగం చేశాడు. నిన్ను నీవు చంపుకొని నీ ప్రేమను నిరూపించుకో అని ప్రియురాలి తండ్రి అనడంతో తుపాకితో తన తలను కాల్చుకొని చనిపోయాడు భోపాల్‌ యువకుడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అరోరా మండలానికి చెందిన అతుల్‌ లఖండే భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) మండల ఉపాధ్యాక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా అదే మండలానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు. దీంతో అతుల్‌కి, ఆమె తండ్రికి మధ్య గొడవలు అయ్యాయి. ఒకానొక దశలో అతుల్‌ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో అమ్మాయిని తీసుకొని ఎంపీనగర్‌కు షిప్ట్‌ అయ్యారు.

కొద్ది రోజుల తర్వాత అతుల్‌ మళ్లీ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆమె తండ్రి నీది ప్రేమ కాదని, అది మోజు అని  ఆరోపించారు.‘ నీ ప్రేమ నిజమైతే నిన్ను నీవు కాల్చుకొని నిరూపించుకో. అప్పుడు బతికి ఉంటే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా. చనిపోతే వచ్చే జన్మలో నా కూతురిని పెళ్లి చేస్కొ’ అని యువతి తండ్రి అతుల్‌కి సవాల్‌ చేశాడు. దీంతో మంగళవారం రాత్రి 9.30గంటలకు ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతుల్‌ అందరూ చూస్తుండగానే తుపాకితో తలను కాల్చుకున్నాడు. అక్కడే ఉన్న అతుల్‌ బంధువు, అతని ప్రియురాలు కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాకర్లు తెలిపారు.

కాగా చనిపోవడానికి ఒక రోజు ముందు అతుల్‌ ఫేస్‌బుక్‌లో తన బాధను పంచుకున్నాడు. ‘ నా ప్రేయసి తండ్రి నా ప్రేమను నిరూపించుకునేందుకు ఒక టాస్క్‌ ఇచ్చాడు. నన్ను నేను కాల్చుకొని నా ప్రేమను నిరూపించుకుంటాను. ఆమె లేని జీవితం నాకు వద్దు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దయచేసి ఆమెను ఎవరూ నిందించకండి. మళ్లి జన్మంటూ ఉంటే తనను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ప్రియురాలితో కలిసి దిగిన 40 ఫోటోలను పోస్ట్‌ చేశాడు.

అతుల్‌ గత 13 సంవత్సరాలుగా ఆ యువతిని ప్రేమిస్తున్నాడని, వారి పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. యువతితో ఫోన్‌ కూడా మాట్లాడనీయకుండా చేశాడని ఆరోపించారు. కాగా ఇప్పటి వరకూ పోలీసులు ఎవరిపైనా  కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు