సిగరెట్‌ అడిగితే ఇ‍వ్వనన్నాడని..

26 Apr, 2019 11:05 IST|Sakshi

న్యూఢిల్లీ : సిగరెట్‌ అడిగితే ఇ‍వ్వనన్నాడన్న కోపంతో 23 ఏళ్ల యువకుడిపై తుపాకితో కాల్పులు జరిపారు ఇద్దరు దుండగులు. బుధవారం రాత్రి ఢిల్లీలోని శాలీమార్‌ భాగ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమిర్‌ ఖాన్‌ అనే యువకుడు, అతని మిత్రుడు పరాస్‌ అరోరాలు బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో శాలీమార్‌ భాగ్‌లోని ఓ శాపింగ్‌ మాల్‌ దగ్గర నిల్చుని ఉన్నారు. అదే సమయంలో అటువైపుగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమిర్‌ను సిగరెట్‌ ఇవ్వవల్సిందిగా కోరారు. అమిర్‌ సిగరెట్‌ ఇచ్చేందుకు తిరష్కరించడంతో అతడిని దుర్భాషలాడారు. దీంతో అమిర్‌కు ఆ ఇద్దరికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆ ఇద్దరు వ్యక్తులు అమిర్‌పై తుపాకితో కాల్పులు జరిపి, అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అమిర్‌ను అతడి మిత్రుడు దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు