నాగపూర్: ఆమె ఒక వర్ధమాన మోడల్. వయసు 19 సంవత్సరాలే అయినా, ఇప్పటికే పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. గొప్ప మోడల్గా ఎదగాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె ప్రియుడు ఆ కలను నిజం కానివ్వలేదు. తను ఎవరితోనో సన్నిహితంగా మెలుగుతుందంటూ అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోడల్ ఖుషీ పరిహార్ నాగపూర్లో నివసిస్తోంది. ఆమె అష్రఫ్ షేక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. గత కొంతకాలంగా ఖుషీపై అనుమానం పెంచుకున్నాడు. అబ్బాయిలతో చనువుగా ఉంటుందని ఆమెతో తరచూ గొడవపడేవాడు.
ఈ క్రమంలో జూలై 12న శుక్రవారం రోజున వారిద్దరూ కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఇదే విషయమై వారి మధ్య తగాదా జరిగింది. దీంతో ఆమెను హత్య చేసి పందూర్న-నాగపూర్ హైవేపై పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు హైవేపై శవాన్ని చూసి పోలీసులకు సమాచారమివ్వగా మోడల్ ఖుషీగా గుర్తించారు. పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా కారును తలపై పోనిచ్చి నుజ్జునుజ్జు చేసి హతమార్చానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు.