8 ఏళ్లుగా సహజీవనం.. ప్రేయసిపై అనుమానంతో..

13 Jul, 2019 10:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసిపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. అందరూ చూస్తుండగానే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మునిక్రాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ మునిక్రాకు చెందిన వరుణ్‌ పాండే అని వ్యక్తి ఓ మహిళతో గత ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వరుణ్‌ను వదిలి విడిగా ఉంటోంది. ప్రియురాలు తనను విడిచిపెట్టిపోవటానికి కారణం ఆమె వేరొకరితో సంబంధం కొనసాగించటమేనని భావించిన వరుణ్‌ ఆమెపై పగ పెంచుకున్నాడు.

గురువారం సాయంత్రం ఆమె తన కూతుర్ని పాఠశాలనుంచి తీసుకురావటానికి వెళ్లింది. పాఠశాల దగ్గరలో కాపు కాసిన వరుణ్‌! ఆమె అక్కడకు రాగానే.. అందరూ చూస్తుండగా కత్తితో పలుమార్లు దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. అతడు వెళ్లిపోగానే అక్కడవున్న జనం పోలీసులకు సమాచారం అందించి, ఆమెను  ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేయసిపై అనుమానంతోనే వరుణ్‌ ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు