జూదాగ్ని

18 Aug, 2018 14:44 IST|Sakshi
నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద గురువారం కిరోసిన్‌ డబ్బాతో ఆత్మహత్యకు యత్నించిన చిల్లకూరు మిక్స్‌డ్‌కాలనీకి చెందిన శివ

పేకాటతో ఎందరో జీవితాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. జూదం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రనకా పగలనకా భార్యాపిల్లలతో కలిసి కాయకష్టం చేసి, అల్లిన బుట్టలు ఇతర సామగ్రిని ఇతర రాష్ట్రాలకు వెళ్లి విక్రయిస్తూ జీవనం సాగించే వారి జీవితాలు కూడా పేకాట తీవ్రతకు బుగ్గవుతున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారి కుటుంబాలు అప్పుల భారంతో మగ్గుతున్నాయి. పేకాట కోసం చేసిన అప్పులు కట్టలేదని గృహ నిర్బంధం చేసిన ఘటనలు కూడా కోకొల్లలుగానే ఉన్నాయి. గురువారం  చిల్లకూరు మిక్స్‌డ్‌ కాలనీకి చెందిన సచ్చాల శివ అనే యువకుడు కలెక్టరేట్‌ వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనే ఇందుకు నిదర్శనం.

గూడూరు: నెల్లూరు జిల్లాలో పేకాట మూడు ముక్కలు.. ఆరు ఆటలుగా సాగుతోంది. పేకాటకు పేద, మధ్య, ధనికులు బానిసలై  జూదాగ్నికి బలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైటెక్‌ స్థాయిలో పేకాట సాగుతోంది. వీటి స్థావరాలకు కోడ్‌లు కేటాయించి.. పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు.  ముఖ్యంగా గూడూరు మండలంలోని మేగనూరు గ్రామ పరిసరాల్లో జూదరులు ప్రత్యేకంగా ప్లేస్‌–1, ప్లేస్‌–2, ప్లేస్‌–3 అనే స్థలాలను ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నారు. ఒక రోజు ఆడిన చోట మరుసటి రోజు ఆడకుండా స్థలాలు మార్చుతూ, ప్లేస్‌ అనే కోడ్‌తో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయం కొందరు పోలీసులకు కూడా తెలుసని సమాచారం. మండలంలోని పురిటిపాళెం సమీపంలోని మామిడిమానును గుర్తుగా చేసుకుని కూడా జూదరులు వాటిని పేకాట స్థావరాలుగా చేసుకున్నారు.

మండలంలోని కొండాగుంట సమీపంలో కూడా పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ యువకుడు పేకాట ఆడడంతో పాటు జూదరులకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకుని వాటిని సప్లయ్‌ చేస్తుంటాడు. అందుకు గాను ఒక్కో ఆటకు ఒక్కొక్కరి వద్ద రూ.1000 వరకూ తీసుకుని, జూదరులకు ఉదయం టిఫిన్‌ నుంచి రాత్రి పూట చికెన్, మటన్‌తో కూడిన విందు భోజనాలను అందజేస్తుంటాడని తెలుస్తోంది. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకూ మూడు ఆటలు ఆడేలా, అవసరాన్ని బట్టి స్థలాలను మార్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

గతంలో మనుబోలు మండలం బద్దెవోలు గ్రామానికి వెళ్లే మార్గంలో ఒక చోట ఆడుతుండేవారు. దీనిపై జూదరుల కుటుంబ సభ్యులే పోలీసులకు సమాచారం ఇచ్చి పేకాటకు అడ్డుకట్ట వేశారు.  చిల్లకూరు సమీపంలోని శ్మశాన వాటిక ప్రాంతంలోని పావురాల తోట కూడా పేకాటకు స్థావరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిల్లకూరు మండలం నాంచారమ్మపేట– పోటుపాళెం మధ్య ఉన్న జామాయిల్‌ తోటల్లో జూదరులు పేకాట ఆడుతుంటారని సమాచారం. వర్షాలు మొదలైతే ఏకంగా పట్టణంలోని లాడ్జిల్లో రూంలు బుక్‌ చేసుకునైనా పేకాట ఆడుతుంటారని తెలుస్తోంది.
 
చితికిపోతున్న ఎరుకుల కుటుంబాలు 
చిల్లకూరు సమీపంలోని మిక్స్‌డ్‌ కాలనీలో సుమారు 250 కుటంబాలు ఉండగా వారిలో 50 కుటుంబాలకు పైగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. వీరు భార్యా పిల్లలతో కలిసి బుట్టలు అల్లుకుని వాటిని కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఆ మొత్తంతో అక్కడి నుంచి ఊరకే రాకుండా అక్కడ దొరికే ప్లాస్టిక్‌ టబ్‌లు, బకెట్లతో పాటు మరికొన్ని వస్తువులను కొనుగోలు చేసి అక్కడ నుంచి తీసుకు వచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తారు. ఇలా వారికి రెండు వైపులా ఆదాయం ఉండడంతో వారి నెల సంపాదన బాగానే ఉంటుంది. అయితే వీరు నిరక్షరాస్యులు కావడంతో ఇప్పటికీ అనాదిగా ఉన్న ఆచారాలను నమ్ముతూ కుల కట్టుబాట్లకు విలువనిస్తూ వాటిని పాటిస్తున్నారు.

మాటమీద నిలబడి నమ్మకంతో ఏదైనా తెగనమ్మి అప్పులు కడుతుంటారు. కట్టుబాటు మీరితే సలసలా కాగే నూనెలో చేయి పెట్టాల్సి ఉంది. వారి కుల పెద్దలు మూకుమ్మడిగా శిక్ష విధిస్తారన్న భయంతోనే వీరు పేకాటకు బానిసలవుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న కొందరు మిక్స్‌డ్‌ కాలనీలోని పురుషులను పలు రకాల వ్యసనాలకు బానిసలను చేయడమే కాకుండా వారికి అప్పులు ఇస్తూ కట్టు బానిసలుగా చేసి వారిపై పెత్తనం చేస్తున్నారు. దీంతో చిల్లకూరులో ఉన్న 50 కుటుంబాల్లో 30 కుటుంబాల వారు ఒక్కో కుటుంబం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ అప్పుల పాలయ్యారు. ఈ అప్పులు తీర్చేందుకు వారు ఇంటిల్లిపాది ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసినా వడ్డీలు కడుతున్నారే తప్ప అసలు మొత్తాలు తీర్చిన దాఖలాలు లేవు.

దీంతో వారి అప్పులు యథాతథంగా మిగిలాయి. ఈ విషయాలు బయటకు రాకపోతుండడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఎలాంటి అవకాశాలు ఉండడం లేదు. ప్రస్తుతం రాపూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో జోరుగా పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. అప్పులిచ్చే వారు వాహనాలను పంపి దగ్గరుండి పేకాట ఆడిస్తూ వారి వద్ద రూ.10 వేలకు రూ.2 వేలు పట్టుకుని రూ.8 వేలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా పోగొట్టుకున్న వారికి మళ్లీ అదే తరహాలో అందరికీ అప్పులు ఇస్తూ ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా కూడా ఆ మొత్తం అంతా అప్పులిచ్చే వారి చేతుల్లో ఉంటుంది. ఆడే వారేమో అప్పులతో అల్లాడుతుంటారు. 

మా కుటుంబాలు చితికిపోతున్నాయి 
నేను కిడ్నీ వ్యాధిగ్రస్తురాల్ని. నా పెద్ద కొడుకు చంద్ర పేకాటలో రూ.21 లక్షలు పోగొట్టి అప్పుల పాలయ్యాడు. నా చిన్న కొడుకు శివ బుట్టలు అల్లి, ప్లాస్టిక్‌ సామగ్రి విక్రయించి కొంత అప్పు తీర్చాడు. అది పోను చంద్ర ఇంకా అప్పు ఉన్నాడు. – లక్ష్మమ్మ, శివ తల్లి 

ఆచారాలతోనే మా కుటుంబాలు నాశనం
మా కుల కట్టుబాట్లతో మేము నాశనమైపోతున్నాము. చదువులకు దూరమైపోతున్నాము. మా అన్న చేసిన అప్పులతో 9వ తరగతి వరకూ చదివిన నేను చదువు ఆపేసి చేసిన అప్పులు తీరుస్తున్నాను. అధికారులు మా జీవితాలపై దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు జీవనోపాధి కల్పించాలి. – శివ, (ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ యువకుడు)

మరిన్ని వార్తలు