పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం

21 Feb, 2018 13:30 IST|Sakshi
సామర్లకోట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాప్రసాద్‌

ఫిర్యాదు చేసిన రెండో భార్యపై

ఓ ప్రబుద్ధుడి ఆగ్రహం

వాదన పెద్దదై దుశ్చర్యకు ఒడిగట్టిన వైనం

సామర్లకోట: రెండో భార్య పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన భర్త పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన చెల్లూరి దుర్గా ప్రసాద్‌ నాలుగేళ్ల క్రితం తణుకుకు చెందిన పూజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పూజిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ తరుణంలో దుర్గాప్రసాద్‌ కాకినాడలో మకాం పెట్టాడు.

కారు డ్రైవరుగా తిరుగుతున్న సమయంలో సామర్లకోటకు చెందిన మీనాక్షితో ఏడాది క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు జరిగిన మొదటి వివాహం విషయాన్ని దాచిపెట్టాడు. ఇటీవలే ఆ విషయం తెలుసుకున్న మీనాక్షి సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మొదటి భార్య పూజిత, దుర్గ ప్రసాద్‌లను స్టేషన్‌ను తీసుకువచ్చారు. అయితే పోలీసు స్టేషన్‌లోనే మీనాక్షితో ఎందుకు ఫిర్యాదు చేశావని వాదనకు దిగాడు. ఆ వాదన పెద్దది కావడంతో దర్గాప్రసాద్‌ బ్లేడుతో మెడ కోసుకున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే దుర్గప్రసాద్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్సై శ్రీనివాసు నాయక్‌ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు