అనుమానస్పదం; పంట చేనులో శవమై...

29 Oct, 2019 09:20 IST|Sakshi

సాక్షి, టేకులపల్లి(ఖమ్మం) : కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. ఈ ఘటన సోమవారం టేకులపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భూక్య శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. టేకులపల్లి మండలం బర్లగూడెం పంచాయతీ జంగాలపల్లికి చెందిన ఈసం రాంబాబు(35)కు పదేళ్ల క్రితం ఆళ్ళపల్లి మండలం రాయిపాడుకు చెందిన రాంబాయితో వివాహమైంది. భార్య రాయిపాడులో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. పెళ్లి అయిన రెండేళ్ల తరువాత రాంబాబు భార్య, కుమారుడితో కలిసి రాయిపాడులో కాపురం పెట్టాడు. కొన్ని రోజులకు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన భర్త రాంబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం జంగాలపల్లిలోని పంట చేనులో కాలి పోయి శవమై కనిపించాడు.

చుట్టుపక్కల వారు అందించిన సమాచారంతో టేకులపల్లి సీఐ రాజు, బోడు ఎస్‌ఐ భూక్య శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం అనుమానాస్పదంగా ఉండటంతో క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ ను పిలిపించారు. మృతదేహం సమీపంలోనే మృతుడి ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నందు వలనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, ఆమె తన సోదరుడిని హత్య చేసిందని మృతుడి సోదరుడు ఈసం శాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు.

పలు అనుమానాలు..
రాంబాబు మృతదేహం వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. కాని, తల వెంట్రుకలు కాలకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలంలో మహిళకు సంబంధించిన చెప్పు, చీరకు పెట్టుకునే క్లిప్పు, ఓ టవల్‌ ఉన్నాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు