యువకుడి హత్య

10 Jan, 2019 12:25 IST|Sakshi
ఘటన స్థలంలో జాగిలంతో దర్యాప్తు, వేలి ముద్రలు సేకరిస్తున్న పోలీసులు శ్రీను (ఫైల్‌)

స్నేహితులే హంతకులని అనుమానం

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు   

నెల్లూరు, బాలాయపల్లి: స్నేహితులు వస్తున్నారు.. కలిసి రావాలని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అడవి ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని చిలమనూరు తిప్ప సమీపం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జడపల్లి శ్రీను (25) బీటెక్‌ చదువుకునే సమయంలో మాధురి అనే యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను శ్రీను తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 2018 ఆగస్టు 30న వెంకటగిరి సమీపంలోని విలగనూరుకు చెందిన అత్త కుమార్తె కౌశల్యతో వివాహం జరిపించారు. కౌశల్య వెంకటగిరిలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదివి స్తున్నాడు.

మంగళవారం తెల్లవారు జామున 5 గంటలకు స్నేహితులు వెంకటగిరికి వస్తున్నారు.. వెళ్లి వస్తామని తల్లి రమణమ్మకు చెప్పడంతో రాత్రుల్లో ఎక్కడికని కసురుకుంది. తల్లికి చెప్పకుండా వెంకటగిరికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో 9 గంటల సమయంలో భార్య కౌశల్య ఫోన్‌ చేసి ఎక్కడ ఉన్నావని అడగడంతో తిప్ప వద్ద ఉన్నాని చెప్పాడు. 9.30 గంటల తర్వాత మళ్లీ ఫోన్‌ చేస్తే స్వీచ్చాఫ్‌ అని వచ్చింది. తల్లి రమణమ్మ, తండ్రి శంకరయ్య ఎదురు చూస్తూ వరండాలోనే పడుకున్నారు. ఉదయం 7 గంటలకు చిలమనూరు సమీపంలో నాయుడుపేట–వెంకటగిరి రోడ్డు తిప్ప సమీపం వద్ద అడవిలో విగత జీవిగా పడి ఉండడంతో గ్రామస్తులు అటుగా వెళ్తూ  చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జి సీఐ మల్లికార్జునరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హతుడు తల వెనుక భాగంతో కత్తితో దాడి చేసినట్లు గుర్తించారు.

ఆనవాళ్లు గుర్తించని జాగిలం
ప్రాథమిక ఆధారాల కోసం నెల్లూరు నుంచి క్లూస్‌టీమ్‌ను, పోలీస్‌ జాగిలాన్ని రప్పించారు. క్లూస్‌టీమ్‌ బైక్‌పై, ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ హత్య జరిగిన స్థలం నుంచి వెంకటగిరి– నాయుడుపేట రోడ్డు మార్గంలో తూర్పు నాయుడుపేట వైపు కొంత దూరం వెళ్లింది. అక్కడి నుంచి వెంకటగిరి వైపు 100 మీటర్లు వెళ్లి తిరిగి ఘటన స్థలానికి చేరుకుంది.

స్నేహితులే హత్య చేసి ఉంటారు
చదువుకునే సమయంలో శ్రీను మాధురి అనే అమ్మయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె స్నేహితులతో కలిసి హత్య చేసి ఉంటుందని మృతుడు భార్య కౌశల్య, బంధువులు పోలీలకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పో లీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు