మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

8 Sep, 2019 13:31 IST|Sakshi

ముంబై : నగరంలో దారుణం జరిగింది. మూడేళ్ల పాపను ఏడు అంతస్థుల నుంచి కిందికి విసిరేశాడు ఓ దుర్మార్గుడు. స్నేహితుడి కూతురనే కనికరం లేకుండా ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ముంబైలోని కొలాబాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి 7.30గంటలకు ఈ దారుణ ఘటన జరిగింది. రాత్రి ఏడున్నర గంటలలో అపార్ట్‌మెంట్‌ పెద్ద శబ్దం వచ్చింది. అందరూ వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో చిన్నారి కనిపించింది. అందరూ షాకయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి... అక్కడికక్కడే చనిపోయింది. ఆ చిట్టితల్లి శరీర భాగాలు ముక్కలైపోయిన దృశ్యం చూసి... అక్కడి వాళ్లంతా తీవ్ర ఆవేదన చెందారు. ఆ చిన్నారిని ఏడో అంతస్థులోని ఓ కిటికిలోంచి పడినట్లు స్థానికులు గుర్తించారు.  

మూడేళ్ల చిన్నారి అంత ఎత్తు కిటికీ ఎక్కలేదని గ్రహించిన వాళ్లు... మొత్తం అపార్ట్‌మెంట్‌ని బ్లాక్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  చిన్నారి తండ్రి స్నేహితుడు 40 ఏళ్ల అనిల్ చుగానీ అనే వ్యక్తే చిన్నారని తోసేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.  అతనే ఏడో అంతస్థులో ఆడుకుంటున్న పాపను బలవంతంగా ఎత్తుకొని... కిటికీ లోంచీ కిందకు విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో ఆ చిన్నారి మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. 

ఏం పాపం చేసిందని ఆ చిట్టితల్లిని అంత క్రూరంగా విసిరేశాడన్నది తెలియలేదు. పోలీసులు అనిల్ చుగానీని అరెస్టు చేశారు. విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాగా. రక్తం మడుగులో పడి ఉన్న చిన్నారి చూసి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రోజూ చక్కగా ఆడుకుంటూ తిరిగే పసి పాప... అత్యంత దయనీయ స్థితిలో చనిపోవడం అపార్ట్‌మెంట్‌ వాసుల్ని కలచివేసింది.

మరిన్ని వార్తలు