అనుమానంతో ముగ్గురి ప్రాణాలు బలి..

22 Jan, 2020 08:19 IST|Sakshi

భోపాల్‌ : అనుమానం ముగ్గురి నిండు ప్రాణాలను బలితీసుకుంది. మంజు అనే మహిళకు పలువురితో వివాహాతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో పాటు ఏడాదిన్నర చిన్నారి, మరో వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ముగ్గురి చేతులు,కాళ్లు కట్టేసి నోటికి టేప్‌ వేసి ఉన్న మృతదేహాలను గుర్తించారు. వ్యక్తి మృత దేహాన్ని గ్యాస్‌ స్టవ్‌పై పడేశారు. కాలిన మృతదేహాలతో పాటు హత్యకు పాల్పడిన వ్యక్తి గోడపై ఓ సందేశం రాశాడు. మంజు కోసం నా సోదరుడు ఉరిపోసుకున్నాడు. ఆమెకు పలువురు వ్యక్తులతో సంబంధాలున్నాయి అందుకే ఆమెను చంపాను..ఆమె కుటుంబంలో ప్రతి ఒక్కరినీ చంపేస్తా అని అందులో రాసి ఉంది. మధ్యప్రదేశ్‌లోని భిలాయ్‌లో ఈ జరిగిన ఘటన కలకలం రేపింది.

మూడు హత్యలకు కారకుడిగా భావిస్తున్న మంజు భర్త రవిని ఒడిషాలోని రూర్కెలాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య జరిగిన రాత్రి మంజు తల్లితండ్రులకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని..అందులో మీ కుమార్తె, అల్లుడు మంటల్లో కాలిపోతున్నారని మీరు వాళ్లను కాపాడుకోవచ్చని అవతలి వ్యక్తి చెప్పాడని బాధితురాలి తల్లితండ్రులు తెలిపారు. ఆ నెంబర్‌కు తాము తిరిగి కాల్‌ చేయగా స్విచాఫ్‌ అవడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి రాగా కాలిపోయి గుర్తుపట్టలేని రీతిలో ఉన్న మృతదేహాలు కనిపించాయి. మహిళతో పాటు ఆమె ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి సజీవ దహనం కాగా, పొగను పీల్చడంతో చిన్నారి మరణించినట్టు పోలీసులు గుర్తించారు. మంజు కాల్‌ రికార్డుల ఆధారంగా పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

చదవండి : ఆస్తి కోసం అక్కమొగుడే..

మరిన్ని వార్తలు