-
సాక్షి, గుంటూరు : భార్య అనారోగ్యాన్ని అవకాశంగా మలుచుకొని.. ఆమె చెల్లెలిని లైంగిక వేధింపులకు గురి చేశాడో దుర్మార్గుడు. పదేళ్లుగా నరకం చూపించాడు. నగ్న ఫొటోలను తీసి ఫేస్బుక్లోనూ పెట్టి వికృత ఆనందం పొందాడు. సహనం నశించిన బాధితురాలు గురువారం గుంటూరు రూరల్ ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన ఓ మహిళకు 2010లో అదే గ్రామానికి చెందిన కె.రవికిరణ్తో వివాహం జరిగింది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది. అప్పటికి బాలిక వయస్సు 15 ఏళ్లు. సోదరి అనారోగ్యానికి గురైన సమయంలో ఇంటి పనులు చేసే సాకుతో రవి కిరణ్ ఆ బాలికను తరచూ ఇంటికి తీసుకువెళుతుండేవాడు. నిత్యం లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. తెలిసీ తెలియని వయస్సులో ఎవరికీ చెప్పుకోలేక మొదట్లో మౌనంగా భరించింది. ఒకసారి ఎదురుతిరగడంతో.. ఈ విషయం చెబితే నీ అక్క కాపురం నాశనం అవుతుందని బెదిరింపులకు దిగాడు.
ఈ క్రమంలో 2018 జూలైలో ఆమెను తమిళనాడులోని వేళాంగిణి దేవాలయానికి తీసుకువెళ్లి బలవంతంగా తాళి కట్టి కామ కోర్కెలు తీర్చుకున్నాడు. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికిరణ్ యువతితో కలిసి తెనాలి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఇష్టపూర్వకంగా తానే వెళ్లానని యువతితో చెప్పించాడు. అప్పటి నుంచి యువతి అక్కను రవి కిరణ్ రోజూ కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో యువతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని.. రహస్యంగా యువతి నగ్నంగా ఉన్న ఫొటోలను తీసి ఫేస్బుక్లో పెట్టాడు. దీంతో సహనం నశించిన బాధితురాలు.. బావ నుంచి రక్షణ కల్పించాలని, తన అక్క కాపురం చక్కదిద్దాలని ఫిర్యాదు చేసింది.