సాక్షి, చెన్నై : యువతి తనకు లొంగలేదని ఆగ్రహించిన ఓ యువకుడు ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విల్లుపురం జిల్లా చిన్న సేలం సమీపంలోని బాక్కంపాడి కాట్టుకొటై ప్రాంతానికి చెందిన చిన్నదురై (32)కి కడలూరు జిల్లా వేప్పూర్ సమీపంలోని అగరం గ్రామానికి చెందిన అరుణాదేవి (28)తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నదురై సింగపూరులో పని చేస్తున్నాడు. అరుణాదేవి తన ఇద్దరు కుమారులతో బాక్కంపాడి కాట్టుకొటైలో అత్తతో నివసిస్తోంది. ఏడాది క్రితం అరుణాదేవి పెద్దమ్మ కుమారుడు ప్రశాంత్ (29) పొంగల్ సారెను తీసుకొచ్చాడు. అతనితో పాటు అతని స్నేహితుడు ఏలుమలై (21) వచ్చాడు. అరుణాదేవిని చూడగానే ఏలుమలైకు ఆమెపై వాంఛ కలిగింది. ఆమె ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఏలుమలై బాక్కంపాడి కాట్టుకొటై వచ్చాడు.
ఇంటిలో అరుణాదేవి ఒంటరిగా ఉండడంతో తన వాంఛ తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. దీన్ని ఊహించని అరుణాదేవి దిగ్భ్రాంతి చెంది వెంటనే అతన్ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించింది. అయినప్పటికీ ఏలుమలై ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో క్యాన్లో ఉన్న కిరసిన్ను అరుణాదేవి ఒంటిపై పోసి నిప్పు పెట్టాడు. అరుణాదేవి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని అంబులెన్స్లో ఆమెను సేలం జిల్లా ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చి అరుణాదేవి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఏలుమలైపై హత్యయత్నం కేసు నమోదు చేశారు.