తినే అన్నంలో విషం కలిపి..

17 Jun, 2020 07:55 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

సాక్షి, భువనేశ్వర్‌ : తినే అన్నంలో విషం కలిపి, భార్యా పిల్లలకు ఇచ్చాడో ప్రబుద్ధుడు. జిల్లాలోని మత్తిలి సమితిలో జరిగిన ఈ దుర్ఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. దుంగియా గుడ గ్రామానికి చెందిన శుక్రమఝి సోమవారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఏదో విషయమై అతడు తన భార్య పూర్ణమఝితో తగాదా పడ్డాడు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యుల అందరితో మంచిగా మాట్లాడి, విషం కలిపిన అన్నం వారికి ఇచ్చి తినమన్నాడు. ఆ అన్నం తిని, పడుకున్న వారు కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతడు పరారయ్యాడు.

ఎంతసేపైనా వారు నిద్రలేవకపోవడంతో గమనించిన గ్రామస్తులు తలుపులు తెరిచి చూడగా, వారు స్పృహలో లేకపోవడం గుర్తించి, వైద్యసేవల నిమిత్తం వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వారికి వైద్యం అందించిన వైద్యులు..విషాహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇదే విషయంపై మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో నమోదు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు