ప్రేమించకుంటే..చంపేస్తా..?

5 Mar, 2020 09:58 IST|Sakshi

సాక్షి, కనగల్‌(నల్గొండ) : ప్రేమించకుంటే చంపేస్తానని ఓ అమ్మాయిని బెరిరించిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కనగల్‌ మండలం పొనుగోడుకు చెందిన మేరుగు మైబూల్‌ తన కూతురును ఎంసెట్‌ కోచింగ్‌ ఇప్పించేందుకు ఐదు నెలల క్రితం హైదరాబాద్‌లో చేర్పించాడు. ఎంసెట్‌ ర్యాంకు రాకపోవడంతో అక్కడే ఓ డిగ్రీ కాలేజీలో చేర్పించారు. 20 ఏళ్ల క్రితం పొనుగోడు నుంచి చాడ పర్వతాలు కుటుంబం హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

పర్వతాలుకు కుమారుడు లోకేష్‌ ఉన్నాడు. ఇతను ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మైబూల్‌కు ఐదు నెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో లోకేష్‌ తారసపడ్డాడు. ఒకటే ఊరు కావడం.. తనకు కుమారుడి వరుస (అమ్మాయికి అన్న వరుస) కావడంతో మైబూల్‌ తన కూతురును లోకేష్‌కు పరిచయం చేశాడు. ఇదే అదునుగా భావించిన లోకేష్‌ ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుని మెల్లమెల్లగా ప్రేమించాలని వేధించడం మొదలు పెట్టాడు. ‘నన్ను ప్రేమించాలని, లేదంటే నిన్ను, మీ అమ్మానాన్నలను చంపేస్తా’ అని బెదిరించడంతో మైబూల్‌ తన కూతురు చదువు మాన్పించాడు. ఈ క్రమంలో ఆదివారం చాడ లోకేష్‌ హైదరాబాద్‌ నుంచి పొనుగోడుకు వచ్చి అమ్మాయిని బెదిరించి సైకోలా వ్యవహరించాడు. దీంతో అమ్మాయి బంధువులు కనగల్‌ పోలీసులకు తెలపడంతో సదరు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు