వరంగల్ : చత్తీస్గఢ్లో మావోయిస్టుల కుట్ర భగ్నమైంది. కూంబింగ్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను భద్రతా బలగాలు కనిపెట్టాయి. దంతేవాడ, నారాయణపూర్ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించే ప్రాంతాల్లో గుంతలు తవ్వి విషపూరిత ఈటెలు, మందుపాతరలను మావోయిస్టులు అమర్చారు. పొరపాటు ఆ గుంతల్లో పడితే పదుల సంఖ్యలో పోలీసులకు ప్రాణహాని జరిగే విధంగా మావోలు పథకం రచించారు.
అయితే భద్రతా బలగాల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ముందుగానే పసిగట్టి పోలీసులు మందుపాతరలను నిర్వీర్యం చేశారు. రేపు చత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన 18 నియోజకవర్గాల్లో తొలిదశ ఎన్నికలు జరుగనున్న సంగతి తెల్సిందే. భారీగా మందుపాతరలు బయటపడటంతో తెలంగాణ-చత్తీస్గఢ్ దండకారణ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.