మావోయిస్టు కొరియర్‌ అరెస్ట్‌

30 Jan, 2018 13:09 IST|Sakshi
మావోయిస్టు కొరియర్‌ను అరెస్టు చేసి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

తూర్పుగోదావరి, నెల్లిపాక (రంపచోడవరం): మావోయిస్టులకు కొరియర్‌గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని ఎటపాక మండల పరిధిలోని పిచుకలపాడు సమీపంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆవివరాలను సోమవారం డీఎస్పీ దిలీప్‌కిరణ్, ఎటపాక సీఐ రవికుమార్‌  వెల్లడించారు. మావోయిస్టులకు సరుకులు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు చర్ల రోడ్డులోని పిచుకలపాడు టి.జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా బావనపల్లి పంచాయతీలోని ఎంవీ 59 గ్రామానికి చెందిన సంజిత్‌ మండల్‌ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు.

అతడి వద్ద నుంచి 204.6 మీటర్ల ఆలీవ్‌గ్రీన్‌ యూనిఫాం క్లాత్, 50 మీటర్ల రెగ్జిన్‌ క్లాత్, రూ.68వేల నగదు, ద్విచక్రవాహనం, నాలుగు మావోయిస్టుల లెటర్‌హెడ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సంజిత్‌ 2006 నుంచి మావోయిస్టులతో పరిచయాలు ఏర్పరచుకుని వారికి దుస్తులు, సామగ్రి చేరవేస్తున్నాడని, 2011లో మావోల వద్ద డబ్బులు తీసుకుని ల్యాండ్‌ మైన్స్‌ పెట్టడం, సామగ్రి కొని ఇవ్వటం వంటి కార్యకలాపాలు చేశాడని తెలిపారు. ఈనెల 25న విజయవాడలో మావోయిస్టులకు దుస్తులు, ఇతర సామగ్రి, కరపత్రాలు కొనుగోలు చేసి బీజాపూర్‌ జిల్లా అంపూర్‌ మావోయిస్టులకు తీసుకువెళుతుండగా ఎటపాక సీఐకి పట్టుబడినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు