మావోయిస్టు కొరియర్‌ అరెస్ట్‌

8 Jun, 2019 02:24 IST|Sakshi
రంజిత్‌రావు

వివరాలను వెల్లడించిన ఏఎస్పీ రాజేష్‌

కొత్తగూడెం అర్బన్‌: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా నాయుడుపాలెంకు చెందిన మందా రంజిత్‌రావు ప్రస్తుతం హైదరాబాద్‌లో తన అన్నయ్య వద్ద ఉంటూ.. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేట్‌ చదువుతున్నాడు. అయితే 2014 నుంచి మావోయిస్టు హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులు, సామగ్రి (బూట్లు, చెప్పులు, బెల్టులు, ముద్రించిన విప్లవ సాహిత్య పుస్తకాలు) సమకూర్చుతున్నాడు.

ఈ క్రమంలో 2018, జూన్‌ 8న మావోయిస్టు పార్టీకి ఆయుధ సామగ్రి (9 జిలెటిన్‌ స్టిక్స్, 9 డిటోనేటర్లు, 2 బాక్సుల ఎక్స్‌ప్లోజివ్‌ వైర్లు) తరలించే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపించారు. విడుదలైన తర్వాత కూడా రంజిత్‌రావు తన పద్ధతి మార్చుకోకుండా, 20 రోజుల క్రితం మావోయిస్టు హరిభూషణ్‌ను కలసి, ఆయన పంపిన విప్లవ సాహిత్యం, ఉత్తరాలను హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో కొత్తగూడెం–ఇల్లెందు క్రాస్‌ రోడ్డులో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు.

మరిన్ని వార్తలు