ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

22 Aug, 2019 03:18 IST|Sakshi

భద్రాద్రి జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో ఘటన  

మణుగూరురూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుగ్గ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉయదం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందాడు. మణగూరు డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మావోయిస్టు పార్టీ విస్తరణలో భాగంగా దళాలు అటవీ ప్రాంతాల్లోని వలస గొత్తికోయ గ్రామాల్లో సంచరిస్తున్నాయనే సమాచారం మేరకు స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు.

ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన మావోయిస్టు దళ సభ్యుడు జాడి వీరస్వామి అలియాస్‌ రఘు(25) మృతి చెందగా, మిగిలిన వారు పారిపోయారు. మృతుడి వద్ద రెండు తపంచాలు, 17 బుల్లెట్లు, రెండు కిట్‌బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యం లభించినట్లు డీఎస్పీ వివరించారు. మణుగూరు తహసీల్దార్‌ మంగీలాల్‌ పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు