మావోయిస్టు ప్రేమజంట  లొంగుబాటు

18 Apr, 2018 10:51 IST|Sakshi
ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ప్రేమజంట

మల్కన్‌గిరి : అనుగుల్‌ జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట ఓ మావోయిస్టు ప్రేమజంట మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీకి చెందిన చోట్టు గుంజు(28) 2000వ సంవత్సరంలో చంద్రగుంజు అనే దళ కమాండర్‌ ఆధ్వర్యంలో దళంలో చేరి అంచెలంచెలుగా సబ్‌జోనల్‌ కమిటీ, ఏరియా కమిటీ, ప్రస్తుతం దళ కమాండర్‌ స్థాయికి ఎదిగాడు. ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్స్‌ వాడేవాడు. మావోయిస్టు దళంలో ఉంటూ పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడు. పోలీసు వాహనాల పేల్చివేత, ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్యలు, ఎదురుకాల్పుల్లో పాల్గొనేవాడు.

ఈ క్రమంలో 2017లో దళంలో చేరిన అమృత అనే మహిళను చోట్టు గుంజు ప్రేమించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దళంలో ప్రేమ, పెళ్లిని అగ్రనేతలు ఒప్పుకోరని, అందుకే దళం వదిలి వచ్చి లొంగిపోతున్నామని ఎస్పీకి మావోయిస్టు ప్రేమజంట తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో మాట్లాడుతూ చోట్టు గుంజు పేరిట రూ.4 లక్షల రివార్డు ఉందని, చోట్టు గుంజుకు అందవలసిన ప్రభుత్వ సహాయాన్ని త్వరలోనే అందజేస్తామని చెప్పారు. అలాగే అమృతకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని అన్నారు.  

మరిన్ని వార్తలు