గుడిలో సినీ నిర్మాత ఆత్మహత్య

17 Jan, 2019 09:29 IST|Sakshi

ముంబై : మరాఠీ సినీ నిర్మాత, కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకుడు సదానంద్‌ లాడ్‌ అలియాస్‌ పప్పు లాడ్‌ ముంబైలోని ఓ దేవాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ బిల్డర్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పప్పు లాడ్(58) ముంబైలోని గిర్గాంలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న గణపతి దేవాలయానికి ప్రతి రోజు వెళ్తుంటారు. బుధవారం ఉదయం ఒక్కరే ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆలయ పూజారికితో కాసేపు మాట్లాడి, పక్కన ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లారు.

కాసేపటి తర్వాత  ఏదో అవసర నిమిత్తం పూజారి ఆ గదిలోకి వెళ్లి చూడగా సదానంద్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించారు. వెంటనే పూజారి పక్కన ఉన్న వారికి సమాచారం ఇచ్చి తలుపులు తెరచి చూడగా అప్పటికే ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో సూసైడ్‌ నోట్‌ లభించిందని పోలీసులు తెలిపారు. ప్రముఖ బిల్డర్‌ వేధింపుల కారణంగా సదానంద్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా ఆత్మహత్య విషయం తెలుసుకున్న సదానంద్‌ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఎంతో ధైర్యాన్ని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదన్నారు. సదానంద్‌ మరాఠీలో 12 చిత్రాలను పైగా నిర్మించారు. 

మరిన్ని వార్తలు