అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

30 Jan, 2018 10:41 IST|Sakshi
గీతాంజలి (ఫైల్‌)

గుంటూరు ఈస్ట్‌: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన స్థానిక కొత్తపేట పరిధిలోని గణేష్‌ రావు వీధిలో  సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం గుంటూరు రూరల్‌ మండలం చిన పలకలూరుకు చెందిన తెలగపల్లి ఉమామహేశ్వరరావు, సుజాత దంపతుల రెండో కుమార్తె గీతాంజలి జేకేసీ కళాశాలలో బీఎస్సీ  చదివింది. తల్లిదండ్రులు 2017 ఆగస్టులో కొత్తపేట గణేష్‌ రావు వీధికి చెందిన చదలవాడ సీత కుమారుడు రవికి ఇచ్చి వివాహం చేశారు. రవి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడు. అత్త సుజాత కట్నకానుకలు సరిపోలేదంటూ కోడలిని నిత్యం వేధించేది. నెల కిందట గీతాంజలికి టైఫాయిడ్‌ రావడంతో తండ్రి పుట్టింటికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఈ నెల 22న అత్తవారింటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో రవి మామతో గొడవపడ్డాడు. సోమవారం రాత్రి రవి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి గదిలో తన భార్య ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న కొత్తపేట ఎస్‌హెచ్‌ఓ వంశీధర్, క్లూస్‌ టీమ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

మరిన్ని వార్తలు