నలుగురి అరెస్ట్, కారు సీజ్
విశాఖపట్నం, సీతమ్మధార(విశాఖ ఉత్తర): అక్రమంగా 293 కిలోల గంజాయి తరలిస్తున్న నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం అడ్డరోడ్డుకు చెందిన ఈ.ధనరాజు, రోలుగుంట మండలం, భూపాలపట్నంకు చెందిన అడ్డా లోవ, అనకాపల్లి గాంధీనగర్ కాలనీకి చెందిన పగడాల దుర్గాబాబు, విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన త్రిపురాన వెంకటరమణ కలిసి గంజాయి నగరానికి తీసుకొచ్చి చెన్నైకు తరలిస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు.
రైల్వే న్యూ కాలనీ దరి శ్రీకన్య థియేటర్ సమీపంలో ఓ కారులో 293 కిలోల గంజాయితో నలుగురూ అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంగీకరించడంతో నలుగురినీ అరెస్ట్ చేసి ఫోర్తుటౌన్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో టాస్క్ఫోర్సు ఎస్ఐలు వాసునాయుడు, సతీష్కుమార్, నారాయణ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఫోర్త్టౌన్ ఎస్ఐ ఎర్రాజీ కేసు నమోదు చేసి కారు సీజ్ చేశారు.