కారులో తరలిస్తున్న 100 కేజీల గంజాయి స్వాధీనం

16 Jan, 2019 11:50 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న గంజాయి

వాహనాన్ని వదిలి పరారైన నిందితులు

గుంటూరు, చిల్లకల్లు (జగ్గయ్యపేట) : కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన  మండలంలోని గౌరవరం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ 37 ఏవై 3333 కారులో అక్రమంగా గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు చిల్లకల్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ జయకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చిరంజీవి సిబ్బందితో జీఎంఆర్‌ టోల్‌ గేట్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న కారు టోల్‌ ప్లాజా సమీపంలోకి వచ్చింది. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించి వారి కారును సమీపంలోని గౌరవరం గ్రామానికి మళ్లించారు. అది గమనించిన పోలీసులు ఆ కారును వెంబడించారు. గ్రామం సమీపంలోని యూకల్లిప్టస్‌ (జామాయిల్‌) తోట వద్ద కారును వదిలి అందులోని వారు పరారయ్యారు. దాంతో పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో 100 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు