బ్యాంకు ఖాతాల్లోకి గంజాయి సొమ్ము

5 May, 2018 11:42 IST|Sakshi
పట్టుకున్న గంజాయితో పోలీసులు(పాతచిత్రం)

ఏజెన్సీ వాసులకు స్మగ్లర్లు  డబ్బులు పంపుతున్నట్టు నిర్థారణ

నగదు కొరత కారణంగా  వేరే ఖాతాల నుంచి ట్రాన్స్‌ఫర్‌  

రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జమైన పద్దులపై పోలీసుల నిఘా

మన్యం ఎనిమిది మండలాల్లో ఐదువేల ఖాతాలను పరిశీలించే అవకాశం

ఎలాంటి ఆదాయ వనరులు, సంపాదన  లేని గిరిజన యువకులు రూ.లక్షలు ఖర్చు చేసి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఆదాయ వనరులు లేకపోయినా అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే  గంజాయి స్మగ్లర్లు  వారి ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారన్న   విషయం బయటపడింది. దీంతో పోలీసులు మన్యంలో ఎనిమిది మండలాల్లో కొన్ని ఖాతాల లావాదేవీలపై నిఘా ఉంచారు. వాటిలోకి  పరిచయంలేని  వ్యక్తుల ఖాతాల నుంచి నగదు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నట్టు తేలింది. ఇలాంటి ఖాతాలు ఐదు వేలు దాటి ఉంటాయని  అనుమానిస్తున్నారు.రూ.50 వేల నుంచి లక్ష దాటి నగదు జమైన  ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించనున్నారు.

కొయ్యూరు(పాడేరు):  రూపాయి ఆదాయం లేని  వ్యక్తి ఒకేసారి లక్ష విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది.  అంత సొమ్ము  ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఏదో చేసి ఉంటాడన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మన్యంలో కొన్ని మండలాల్లో ఎలాంటి ఆదాయం లేని వ్యక్తులు ఖరీదైన ద్విచక్ర వాహనాలను కొంటున్నారు. విలాసాలకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు అలాంటి వారిపై నిఘా ఉంచారు. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. దీనిలో కొందరు గంజాయి స్మగ్లర్లకు  సహకరిస్తున్నట్టుగా తేలింది.గతంలో డబ్బులను నేరుగా ఇచ్చేవారు. ఇప్పుడు నగదు కొరత కారణంగా ఖాతాల్లో వేస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.ఇక్కడ వారిని విచారిస్తే గంజాయి స్మగ్లర్ల భరతం పట్టే వీలుంటుందని  భావిస్తున్నారు. మన్యంలో 11  మండలాలు ఉంటే వాటిలో ఎనిమిది మండలాల్లో జరుగుతున్న వ్యవహారాలపై  నిఘా ఉంచా రు.

డుంబ్రిగుడ, పాడేరు,ముంచంగిపుట్టు, పెదబయలు,గూడెంకొత్తవీధి,హుకుంపేట, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో ఖాతాలను పరిశీలిస్తున్నారు. కొయ్యూరు మండలంలో గంజాయి పండించకపోయినా స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఇలా చేస్తున్న కొందరు అనుమానితులపై పోలీసులు నిఘా ఉంచారు. ఇదిలా ఉంటే  ఇప్పటికే కొన్ని ఖాతాలను పరిశీలించినట్టు సమాచారం.  వాటి  ఆదారంగా స్మగ్లర్లకు సహకరిస్తున్న వారిని ప్రశ్నించనున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోను గంజాయి ఎక్కడ బయటపడినా అది విశాఖ మన్యం నుంచే రవాణా అయినట్టు తేలుతోంది. ఎౖMð్సజ్‌ శాఖ కూడా గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు వీలుగా నర్సీపట్నం,పాడేరుతో పాటు కొయ్యూరులో రెండు ఎక్సైజ్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ రెండున్నర సంవత్సరాల్లో పోలీసులు  150 టన్నుల గంజాయిని పట్టుకున్నారు.
ఎక్సైజ్‌ శాఖ  35 టన్నుల గంజాయి పట్టుకుంది. ఇలా రెండు శాఖలు పట్టుకున్న గంజాయి విలువ రూ.60 కోట్ల వరకు ఉంటుంది.

మరిన్ని వార్తలు