ప్రియుడితో వెళ్లిన వివాహిత.. ఇద్దర్ని చంపిన తండ్రి

10 Jun, 2020 15:39 IST|Sakshi

జైపూర్‌: వివాహం అయిన ఓ మహిళ ప్రియుడితో కలిసి అత్తవారి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వివాహిత తండ్రి ఆగ్రహంతో సొంత ఊరి నుంచి వచ్చి కుమార్తె వెళ్లిపోయిన వ్యక్తి  కుటుంబంలోని ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. రాజస్తాన్‌లోని జున్జును జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. హర్యానాకు చెందిన అనిల్‌ జాట్‌ కుమార్తెకు రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కాగా ఆమె స్థానికంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అత్తవారి ఇంటి నుంచి వెళ్లి పోయింది. తమ కోడలు కనిపించడం లేదని అత్త ఇంటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ విషయం తెలిసిన ఆ మహిళ తండ్రి అనిల్‌ జాట్‌, హర్యానా నుంచి బైక్‌పై రాజస్తాన్‌లోని ఈ గ్రామానికి వచ్చాడు. ఆగ్రహంతో తన కుమార్తెను తీసుకెళ్లిన వ్యక్తి ఇంటికెళ్లి డాబాపైన నిద్రిస్తున్న అతడి సోదరుడు దీపక్‌, స్నేహితుడు నరేశ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. తెల్లారిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన దీపక్‌ తండ్రి రాజ్‌వీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిందితుడు అనిల్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు పోలీసులు. కాగా తన పరువు తీసిన కుమార్తెతో పాటు ఆమెను తీసుకెళ్లిన వ్యక్తిని, అతడి తండ్రిని జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత హత్య చేస్తానని అనిల్‌ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు