నయవంచకుడిపై కేసు

21 Feb, 2018 08:21 IST|Sakshi

బంజారాహిల్స్‌: పెళ్లై పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తనకు ఇంకా పెళ్లి కాలేదని ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 11లోని గౌరిశంకర్‌ కాలనీకి యువతి(26) మాదాపూర్‌లోని ఓ సంస్థలో పని చేస్తోంది. ఆమెకు అదేసంస్థలో పని చేస్తున్న రవి అనే యువకుడు  2007లో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఇద్దరూ కలిసి తిరిగారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన చేయడంతో పెద్దలను ఒప్పిస్తానని చెప్పి వెళ్లిన అతను తప్పించుకు తిరుగుతున్నాడు.

దీంతో బాధితురాలు అతడి బావకు ఫోన్‌ చేయగా ఆయన భార్య లిఫ్ట్‌ చేసింది. జరిగిన విషయాన్ని యువతి చెప్పడంతో తన తమ్ముడికి ఎప్పుడో పెళ్లయిందని పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. దీనిపై రవిని నిలదీయగా  ప్రేమ విషయాన్ని తన భార్యతో చెప్పానని ఆమె పెళ్ళికి అంగీకరించిందని త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. అయితే తనను వదిలేయాలని మరో పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమె ఇంటికి వచ్చి దాడి చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు