ప్రేమ పేరుతో వంచించాడు..

23 Jul, 2019 12:43 IST|Sakshi

రూరల్‌ ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు

సాక్షి, గుంటూరు: ‘హాయ్‌ అంటూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా.. ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ముందే పెళ్లయిందని తెలిసి నిలదీస్తే కుటుంబ సభ్యులతో కలసి నాపై దాడి చేశారు’ అంటూ కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ఓ వివాహిత సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్‌ ఏఎస్పీ ఎస్‌.వరదరాజుకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్‌ వినయ్‌ ఫేస్‌బుక్‌లో ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆపై ఆమెతో స్నేహంగా ఉంటూ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఓ రోజు హడావుడిగా ఆమెను తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. భర్త మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న వినయ్‌ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వినయ్‌కు ముందుగా వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని తెలుసుకుంది. 

నమ్మించి తనను మోసం చేశావంటూ దీనిపై వినయ్‌ను నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్న క్రమంలో అత్తమామలు కల్పించుకొని వివాహితపై దాడికి యత్నించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన వివాహిత నేరుగా పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోకపోవడంతో న్యాయం చేయాలని బాధితురాలు ఏఎస్పీని వేడుకుంది.  

మరిన్ని వార్తలు