క్షణికావేశంలో లోకం విడిచింది..

10 Jan, 2018 10:32 IST|Sakshi
ఉరివేసుకొని మృతి చెందిన భూలక్ష్మి

భర్త తాగుతున్నాడంటూ ఉరిపోసుకున్న వివాహిత

ప్రకాశం, గుడ్లూరు: భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఉరివేసుకొని వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని తెట్టు గ్రామంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన దావులూరి వెంకటేశ్వర్లు అదే జిల్లా ఈపూరు మండలం బొగ్గారం గ్రామానికి చెందిన భూ లక్ష్మీని వివాహం చేసున్నాడు. వారికి 5 సంవత్సరాల కుమార్తె సుస్మిత 2 సంవత్సరాల షణ్ముఖ సాయిలున్నారు. వెంకటేశ్వర్లు నాలుగు సంవత్సరాల నుంచి తెట్టు వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోలు బంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి తెట్టులోనే బాబురావు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల నుంచి వెంకటేశ్వర్లు తరచు మద్యం సేవిస్తూ వస్తుండటంతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

సోమవారం రాత్రి కూడా ఇదే విషయంలో ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. తరువాత వెంకటేశ్వర్లు స్నానం చేయడానికి వెళ్లగా భూ లక్ష్మి(28) ఇంట్లో ఉరివేసుకొంది. స్నానపు గదిలో నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు తాడుకు వేళ్లాడుతున్న భూలక్ష్మీని కిందకు దించాడు. అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై వేమన  సంఘటనా స్థలంకు చేరుకున్నారు. మృతదేహాన్ని సీఐ నరసింహారావు మంగళవారం పరిశీలించారు. తహసీల్దార్‌ ఇందిరాదేవి శవ పంచనామా నిర్వహించారు. మృతురాలు తండ్రి వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

మరిన్ని వార్తలు