లావుగా ఉన్నావని అత్తింటి వేధింపులతో..

16 Nov, 2019 07:45 IST|Sakshi
వివరాలు అడిగి తెలుసుకుంటున్న తహసీల్దార్, ఎస్సై(ఇన్‌సెట్లో) మౌనిక (ఫైల్‌) 

పెళ్లయిన 9 నెలలకే తనువు చాలింపు

దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య

సాక్షి, చెన్నూర్‌(ఆదిలాలబాద్‌) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్‌ తెలిపిన వివరాలివీ..కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన తోట కిషన్‌–మధునమ్మలకు మానస, మౌనిక ఇద్దరు కూతుర్లు. తండ్రి కిషన్‌ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమార్తె మౌనిక (22) మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా, ఆరుడ గ్రామానికి చెందిన ఏతం కిరణ్‌కు రూ.8లక్షల కట్నం ఇచ్చి 2018లో వివాహం చేసింది. మౌనిక లావుగా ఉండడంతో భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. శుక్రవారం బంధువులు ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు తల్లి మంచిర్యాల వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మానిక చున్నీతో దూలానికి ఉరేసుకుంది. ఎస్సై సంజీవ్, తహసీల్దార్‌ పుష్పలత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త కిరణ్, అత్తమామలు విడాకులు ఇవ్వాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మేనమామ మల్లేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు