నువ్‌ అందంగా లేవు.. నీ చెల్లితో పెళ్లి చెయ్‌..!!

11 Nov, 2018 08:23 IST|Sakshi

ఆదోని టౌన్‌: అందంగా లేవని భర్త నిత్యం వేధిస్తుండటంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం కోసిగిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. కోసిగికి చెందిన లక్ష్మి, కిష్టప్ప దంపతుల కూతురు లింగమ్మను ఏడు నెలల క్రితం పల్లెపాడు గ్రామానికి చెందిన మల్లేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన కొంతకాలానికే అందంగా లేవని, నీ చెల్లిని తనకు ఇచ్చి వివాహం చేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోవాలని వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక దీపావళికి పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి ఆదివారం అత్తగారింటికి పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టంలేక శనివారమే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోసిగి పోలీసులకు సమాచారం ఇచ్చామని ఔట్‌పోస్ట్‌ కానిస్టేబుల్‌ చింతలయ్య తెలిపారు.   

మరిన్ని వార్తలు