భర్త వేధింపులు తాళలేక..

1 May, 2018 12:48 IST|Sakshi
ఆత్యహత్య చేసుకున్న వాణి ఈశ్వరి మృతదేహం

వివాహిత ఆత్మహత్య

అత్తింటి వారే చంపేశారని పుట్టింటి వారి ఆరోపణ

అమలాపురం రూరల్‌: మండలంలోని పేరూరు శివారు లంకతోటలో భర్త, అత్త మామల వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుందని పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. గ్రామానికి చెందిన కుడుపూడి తనీష్‌కుమార్‌ భార్య వాణి ఈశ్వరి (28) ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌడర్‌గా పనిచేస్తున్న తనీష్‌కుమార్‌కు అదే గ్రామానికి చెందిన వాణి ఈశ్వరితో 11ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పదేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఇటీవల కాలంలో తనీష్‌కుమార్‌ భార్యను నిర్లక్ష్యం చేస్తూ వేధిస్తున్నాడని సీఐ చెప్పారు. భర్తతో పాటు అత్త మామలు రాజరాజేశ్వరి, సూర్యనారాయణలు కూడా ఆమెను వేధించసాగారు.

కొన్ని నెలలుగా భర్త, అత్తమామల వేధింపులు అధికం కావడంతో వాటిని భరించలేక వాణి ఈశ్వరి సోమవారం తెల్లవారు జామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ కోటేశ్వరరావు సోమవారం ఉదయం పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో కొన్ని ఆధారాలను సేకరించారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే వాణి ఈశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక  ఆధారాలు లభించడంతో సీఐ శ్రీరామకోటేశ్వరరావు భర్త, అత్త మామలను తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్టు సీఐ తెలిపారు.

హత్య చేసి ఆత్యహత్యగా చిత్రీకరణ పుట్టింటి వారు ఫిర్యాదు
తన చెల్లిని ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి సోదరుడు రాయుడు వెంకటరమణ ఆరోపించారు. తన బావకు వేరే పెళ్లి చేయాలన్న ఆలోచనతో అత్త మామలు తన చెల్లిని పథకం ప్రకారం హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారు జామున బావ, చెల్లి గొడవ పడ్డారని తెలిసిందని, ఆ సమయంలోనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన చెల్లి మరణ వార్త విని తాము వెళ్లే సరికే ఉరి నుంచి శవాన్ని తప్పించినట్టుగా చేసి ఓ కుర్చీలో ఉంచారని చెప్పారు. తన చెల్లిది ముమ్మాటికీ హత్యేనని, ఈ మేరకు తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని వెంకటరమణ తెలిపారు.

మరిన్ని వార్తలు