కాకినాడ క్రైం: కాకినాడ రూరల్ మండలం స్వామినగర్కు చెందిన నేమాల సుధ (22) ఇంట్లో చున్నీతో ఉరేసుకుని మరణించింది. శుక్రవారం ఉదయం సుధ ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో భర్త దుర్గాప్రసాద్ చూసి ఫోన్ మాట్లాడవద్దని చెప్పినా వినలేదు. దీంతో సాయంత్రం ‘మీ నాన్నకు విషయం చెబుతాను’ అని చెప్పి తాపీ పనికి వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్ ఇంటి తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడం, ఇంట్లో టీవీ ఆన్చేసి ఉండడంతో అదే ప్రాంతంలో ఉంటున్న తన మామయ్య కోసూరి తాతారావుతో విషయం చెప్పి తీసుకొచ్చారు. ఎంత ప్రయత్నించినా తలుపు తీయకపోవడంతో బద్దలుగొట్టి చూసేసరికి ఇంట్లో దూలానికి వేలాడుతూ సుధ కన్పించింది.
ఈ విషయాన్ని ఇంద్రపాలెం పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. సుధ పెళ్లికి ముందే నర్సీపట్నంలోని తన మేనత్త కొడుకుతో ప్రేమలో ఉండేదని, పెళ్లయిన తరువాత కూడా ఫోను మాట్లాడుతూ ఉండేదని భర్త దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయశంకర్ తెలిపారు. అమ్మాయి చనిపోయే ముందు రాసిన లెటర్ ఒకటి దొరికిందని, తాను తన బంధువుల అబ్బాయితో మాట్లాడుతున్నానని, ఈ విషయం ఇంట్లో తెలిసిందని, బంధువులు అందరికీ తెలిస్తే తమ కుటుంబ పరువుపోతుందన్న ఉద్దేశంతో తాను చనిపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ అందులో రాసినట్టు ఎస్సై విజయశంకర్ తెలిపారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.