మహారాణిపేట(విశాఖ దక్షిణ): వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. గోపాలపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని నందమూరినగర్లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నందమూరి నగర్లో నారాయణ అపార్టుమెంటులో భర్త సత్తి సురేష్తో కలిసి భార్య మహాలక్ష్మి నివాసం ఉంటున్నారు. వీరికి 2009లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.25 లక్షల నగదు, 60 కాసుల బంగారం, ఎకరా పొలం కట్నంగా ఇచ్చారు. అయినా ఇంకా అదనపు కట్నం కావాలని భర్త సురేష్ తరచూ వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్లాబ్ హుక్కుకు చీరతో మహాలక్ష్మి మంగళవారం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. మృతురాలి తండ్రి కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.