వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

19 Feb, 2019 06:06 IST|Sakshi
సౌజన్య మృతదేహం

చిక్కడపల్లి: భర్త, కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా,   ఇందిరానగర్‌కు చెందిన సౌజన్య (29), మెట్రో సర్వో డ్రైవ్స్‌ కంపెనీలో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న చిక్కడపల్లికి చెందిన  ప్రకాష్‌ను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది జూలైలో పాపకు జన్మనిచ్చిన సౌజన్య రెండు నెలల క్రితం చిక్కడపల్లిలోని అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన సౌజన్య ఎంత కూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త కిటికీలోంచి చూడగా సౌజన్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి  తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె భర్త, అత్త రుష్యేంద్రమణి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తండ్రిపెద్దపుల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు