వివాహిత అనుమానాస్పద మృతి

9 Feb, 2019 08:30 IST|Sakshi
నవీన్, ప్రియాంక పెళ్లినాటి ఫొటో

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

ఏడాది కాకుండానే ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

హత్యే అంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు

గుంటూరు, చిలకలూరిపేట రూరల్‌: వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారిద్దరి మనసులు విద్యార్థి దశలోనే కలిశాయి. వయసుతో పాటు వారి మధ్య బంధం కూడా పెరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెప్పగా యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువకుడి తరఫున పెద్దలు యువతి తల్లిదండ్రులకు నచ్చజెప్పి అంగీకరింపజేశారు. ఎట్టకేలకు అందరి అంగీకారంతో ప్రేమికులు భార్యాభర్తలయ్యారు. వివాహ బంధం ఏడాది పూర్తికాకుండానే ఆమె మృతిచెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుంటే తమ కుమార్తెను అత్తింటివారే వేధించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక మృతదేహం, మృతురాలి తల్లిని వివరాలు అడిగితెలుసుకుంటున్న తహసీల్దార్, ఎస్‌ఐ
మృతురాలి తల్లి రోజారమణి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మృతురాలి తల్లి కథనం ప్రకారం.. ప్రియాంక (23) ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన నవీన్‌ను ప్రేమించింది. తొలుత తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా ఆ తర్వాత కూతురి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు. నవీన్‌ మార్టూరులో గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది మాసాల నుంచి నవీన్, ప్రియాంకల మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయి. గుంటూరు వెళ్లి తల్లిదండ్రుల నుంచి మరికొంత నగదు తీసుకు రావాలని నవీన్‌ తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పెళ్లయిన సంవత్సరం వ్యవధిలోనే పలు విడతలు డబ్బులు సర్దుబాటు చేశాం. ఈ నేపథ్యంలో గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ప్రియాంకకు తల్లి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. అనుమానం వచ్చి మార్టూరు రాగా ప్రియాంక సీలింగ్‌కు ఉరేసుకుని తల్లికి కనపించింది. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. తమ కుమార్తెను భర్త నవీన్, అత్త, మామ హింసించి, వేధించి హత్య చేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు