ప్రకాశం, యర్రగొండపాలెం: భర్త దూరం కావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి యర్రగొండపాలెంలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేడ్కర్నగర్లో నివాసం ఉంటున్న ఎం.ధనలక్ష్మి(28) భర్తకు విడాకులు ఇచ్చింది. కుమార్తెతో కలిసి తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఆమె కొంతకాలంగా కలత చెందుతున్నట్టు ఆమె బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ధనలక్ష్మి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఒక కూతురు ఉంది. ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై పి.ముక్కంటి తెలిపారు.