సాక్షి, చెన్నై : కోడలి వివాహేతర సంబంధం బయటపెట్టేందుకు యత్నించిన అత్త నుంచి ప్రియుడితో కోడలు పరారైన ఘటన తిరుమయంలో చోటుచేసుకుంది. వివరాలు.. పుదుక్కోటై జిల్లా కోవిల్పట్టికి చెందిన సులోచన (32). ఈమెకు అరిమళం సమీపంలోని మేల్నిలైపట్టికి చెందిన యువకుడితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. సులోచన భర్త సింగపూర్లో పనిచేస్తున్నాడు. వీరికి పిల్లలు లేరు. ఇలావుండగా మూడు నెలల క్రితం సొంతవూరికి వచ్చిన సులోచన భర్త.. భార్యకు ఇల్లు కట్టించి, అన్ని వస్తువులు సమకూర్చి విదేశానికి వెళ్లాడు. భార్యకు ప్రతి నెలా డబ్బు పంపేవాడు. ఈ నేపథ్యంలో సులోచనకు పుదుక్కోటై కట్టియవయల్ ప్రాంతానికి చెందిన మాణిక్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
మాణిక్య ప్రతిరోజు రాత్రి సులోచన ఇంటికి వచ్చి తెల్లవారుజామున వెళ్లేవాడు. ఈ వ్యవహారం సులోచన అత్తకు తెలిసింది. దీంతో ఆమె గురువారం రాత్రి సులోచన, ప్రియుడితో ఏకాంతంగా ఉండగా ఇంటికి తాళం వేసింది. ఇరుగుపొరుగు వారిని అక్కడికి రప్పించింది. ప్రజల అలికిడి తెలుసుకున్న ఇద్దరు వెనుకవైపు మార్గాన బైక్పై ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమజంట కోసం గాలిస్తున్నారు.