పచ్చని కుటుంబాన్ని చిదిమేసిన క్రికెట్‌ బెట్టింగ్‌లు

22 Nov, 2019 11:50 IST|Sakshi
మృతురాలు గోళ్ల నాగలక్ష్మి (ఫైల్‌) నిందితుడు సుబ్రహ్మణ్యం

సాక్షి, నిడదవోలు: వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడదవోలు మండలం సింగవరంలో చోటుచేసుకుంది. నిడదవోలు సీఐ కేఏ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. సింగవరం గ్రామానికి చెందిన ఆమర్తి సుబ్రహ్మణ్యం, నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మి (24)కు 2012లో వివాహమైంది. కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమారులు. నిడదవోలు హీరోహోండా షోరూంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం కొంతకాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. క్రికెట్‌ బెట్టింగుల్లో లక్షలు పోగొట్టుకున్నాడు. బెట్టింగులు, మద్యానికి బానిసై రూ.10 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. పుట్టింటి నుంచి సొమ్ములు తీసుకురావాలంటూ భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సింగవరంలోని సొంతింటిని కూడా అమ్మేశాడు. 

అనాథలుగా మారిన చిన్నారులు
అట్లపాడులో నాగలక్ష్మి పేరున ఉన్న ఇంటి స్థలాన్ని కూడా అమ్మాలంటూ ఇటీవల ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు తాళలేక నాగలక్ష్మి సింగవరంలోని తన ఇంట్లోని స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోట్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతిచెందింది. ఘటనా స్థలాన్ని సీఐ కేఏ స్వామి, ఎస్సై కె.ప్రసాద్‌ పరిశీలించారు. విచారణ అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైన పెట్రోల్‌ పోసి హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెను కావాలనే హతమార్చారని మృతురాలి తల్లి గోళ్ల దానమ్మ కన్నీరుమున్నీరయ్యింది. దానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.      

మరిన్ని వార్తలు