ఘోరం

23 Feb, 2018 13:54 IST|Sakshi
మృతురాలి తలపై గాయాలు చూపుతున్న అత్త రవణమ్మ,తాడంగి గౌతమి(ఫైల్‌),గౌతమి మృతదేహం

గిరిజన వివాహిత అనుమానాస్పద మృతి

లైంగికదాడి జరిపి,  ఆపై హత్య చేసినట్టు ఆరోపణ

కేసు నమోదు

శ్రీకాకుళం , భామిని: పట్టపగలు.. అందరూ తిరుగాడుతున్న రోడ్డు పక్కనే ఘోరం చోటు చేసుకుంది. ఓ అమాయిక గిరిజన వివాహిత దారుణ హత్యకు గురైంది. ఓ కామాంధుడి చేతిలో లైంగికదాడికి గురై, ఆపై ప్రాణాలు కోల్పోయిందని సంఘటన తీరుబట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం...  

భామిని మండలం వడ్డంగిగూడకు చెందిన తాడంగి మనోహర్‌కు రాయగడకు చెందిన గౌతమి(25)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు కలగకపోయినను అన్యోన్యంగా ఉంటూ జీవిస్తున్నారు. గ్రామానికి సమీపంలో జీడితోట వద్ద పశువుల పాక నిర్మించి ఆవులు, మేకలు పెంచుకొంటున్నారు. పగలంతా పశువులను మేపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గౌతమి భర్త మనోహర్‌ అటవీ హక్కుల పుస్తకం కోసం భామినిలోని తహసీల్దార్‌ కార్యాలయానికి గురువారం వెళ్లాడు. అయితే మధ్యాహ్న సమయంలో గౌతమి ఒక్కదాయే శాల వద్ద పశువులను మేపిస్తుంది. ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఓ కామాంధుడు గౌతమిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ప్రతిఘటించిన ఆమెను తీవ్రంగా కొట్టాడు.

విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెను బలంగా కొట్టి హత్యకు పాల్పడ్డాడు. వడ్డంగిగూడ నుంచి మూలగూడకు వెళ్లే రోడ్డు పక్కనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అటువైపుగా వెళ్లిన ఆదివాసీలు కొందరు గౌతమి పరిస్థితిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతురాలి తలపై గాయాలు ఉండడం, చెవుల నుంచి రక్తం కారడం, దుస్తులు నిండా రక్తపు మరకలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు. ఎవరో లైంగికదాడి చేసిన తర్వాత హత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌతమి మృతితో భర్త మనోహర్, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గౌతమి వడ్డంగిగూడలోనే బంధువుల ఇంటి వద్ద ఉంటూ పదవ తరగతి వరకు చదువుకుంది. పెళ్లైన తర్వాత భర్తతో కొన్నాళ్లు వలస వెళ్లింది. తిరిగి భార్యాభర్తలు వచ్చి స్థానికంగా స్థిరపడినట్టు మృతురాలి అత్త రవణమ్మ విలపిస్తుంది. ఈ ఘటనపై స్థానిక వీఆర్‌ఏ నిమ్మల కర్ణ ఫిర్యాదు మేరకు వీఆర్‌ఓ సీహెచ్‌ భారతి, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేశారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు