అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

7 Jan, 2020 13:32 IST|Sakshi
తల్లి చనిపోయిందని తెలీక తండ్రి తేజేశ్వరరావు ఒడిలో ఆడుకుంటున్న కూతురు ప్రణతి

శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ప్రేమను జీవితాంతం కొనసాగించలేకపోయారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పలాస పొందర వీధిలోని పొందర కులానికి చెందిన పొందర తేజేశ్వరరావు, ఉదయపురంలోని చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మౌనికలు ఇరు కుటుంబాలను ఎదురించి మరీ నాలుగేళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. పలాస జీడిపిక్క బొమ్మకు సమీపాన కేటీ రోడ్డుకు ఆనుకుని ఉ న్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం నాలుగేళ్లు సజావుగానే సాగింది. ఈ దంపతులు ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆదివారం రాత్రి దంపతులు సినిమాకు వెళ్లి వచ్చారు.

ఆ తర్వాత ఏం జరిగిందో గానీ మౌనిక ప్రాణాలు కోల్పోయింది. సెల్‌ఫోన్‌ తగిలి చనిపోయిందని, భర్త సెల్‌ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని స్థానికంగా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. భర్త కూడా ఇలాగే చెబుతున్నారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగితే సోమవారం ఉదయం పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించంతో సీఐ వేణుగోపాలరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాతే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువులు ‘కులాంతర వివాహం చేసుకున్నప్పుడే మా అమ్మాయిచనిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమీ చనిపోలేదు’ అని మాట్లాడడం గమనార్హం.

మరిన్ని వార్తలు