వివాహిత అనుమానాస్పద మృతి

30 Oct, 2018 07:49 IST|Sakshi
వెంకటలక్ష్మి(ఫైల్‌)

ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మూడో వార్డు రవీంద్రనగర్‌ ప్రాంతం ఎస్‌.ఐ.జి.నగర్‌లో మల్లేటి వెంకటలక్ష్మి అలియాస్‌ సంతోషి(27), రాజు కుటుంబం నివాసముంటోంది. సూమారు ఐదేళ్ల కిందట ఎస్‌.ఐ.జి.నగరానికి చెందిన రాజుకు, సింహాచలం ప్రాంతం ప్రహ్లాదపురానికి చెందిన వెంకటలక్ష్మికి వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. రాజు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం మధ్యాహం రాజు పనికి వెళ్లిన సమయంలో వెంకటలక్ష్మి ఇంటి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమెతో పాటు పక్కనే ఉన్న ఏడాది కుమార్తె కొంతసేపటికి ఏడవడంతో ఏం జరిగిందో తెలియని చుట్టుపక్కల వారు తలుపులు పగలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఆమె చీరతో ఉరి వేసుకొని కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆరిలోవ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు పాపారావు, శ్యామలరావు, సిబ్బంది అక్కడకు చేరుకొన్నారు. వెంకటలక్ష్మి ఉరి వేసుకొన్న తీరు పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా తన కుమార్తెను భర్త రాజు, అత్త సీతమ్మ, బావ శ్రీనివాస్, తోటికోడలు కాశీ   ఉరివేసి చంపేశారంటూ మృతురాలి తల్లి సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు