నా భర్త వేధిస్తున్నాడు

2 Apr, 2019 07:10 IST|Sakshi
ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

సీఐ కావడంతో అక్రమంగా కేసులు పెడుతున్నాడు

ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

సీపీ క్యాంపు ఆఫీస్‌ వద్ద ఘటన

నాగోలు: తన భర్త పోలీస్‌ ఉద్యోగంలో ఉండి పలుకుబడితో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడంలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన ముగ్గురు కుమారులను తీసుకుని ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆమె కిరోసిన్‌ పోసుకుని, పిల్లలకు పోసి ఆత్మహత్యా యత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కరణ్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐగా పనిచేస్తున్న కోలుకులపల్లి రాజయ్యతో అదే ప్రాం తానికి రేణుకాగౌడ్‌తో ఓ కేసు విషయంలో పరిచయం ఏర్పడింది. రాజయ్య తన భార్య చనిపోయిందని నమ్మించి 2009లో యాదాద్రిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తాండూరు, పరిగి, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో కొంతకాలం కాపురం పెట్టారు.

అతడికి నగరానికి బదిలీ కావడంతో కుటుంబ సభ్యులను తీసుకువచ్చి ఎల్‌బీనగర్‌ ప్రాంతంలోని మన్సూరాబాద్‌లో కాపురం పెట్టాడు. వీరికి ముగ్గురు కుమారులు రాజేష్, రాంచరణ్, నర్సింహులు ఉన్నారు. సీఐగా ప్రమోషన్‌ వచ్చిన అనంతరం రాజయ్య రేణుకతోపాటు పిల్లలను పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై రేణుక సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేశాడని ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని, సరైన న్యాయం చేయడంలేదని ప్రస్తుతం సంగారెడ్డిలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజయ్య తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని, మరోభార్యతో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయిస్తున్నారని మనస్థాపం చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసు కున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్, వనస్థలిపురం ఏసీపీని పిలిపించి విషయంపై ఆరాతీశారు. గతంలోనే వివాహం జరిగిన రాజయ్య రేణుకకు, అన్యాయం చేయడంతో పాటు ప్రస్తుతం మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు విచారించి బాధితురాలికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. 

మరిన్ని వార్తలు