వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

15 Jul, 2019 11:42 IST|Sakshi
జ్యోతి (ఫైల్‌)

భాగ్యనగర్‌ కాలనీ: వరకట్న వేధింపులు తాళ లేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో ఉంతటున్న నరేష్, జ్యోతి (20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొంత కాలంగా కట్నం లేవాలని నరేష్‌ జ్యోతిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని పెద్దమనుషులతో పంచాయితీ చేయడంతో సమస్య సద్దుమణిగింది. గత కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి రూ. లక్ష తీసుకురావాలని జ్యోతిని వేధిస్తున్నాడు.  దీంతో మనస్తాపానికిలోనైన జ్యోతి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు జవహర్‌లాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు..
మేడిపల్లి: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచివాణి సింగారం గ్రామ పరిధిలోని సుప్రబాత్‌ టౌన్‌షిప్‌లో ఉంటున్న చింత మల్లేశ్‌(65) సింగరేణిలో పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న అతను భార్యతో కలిసి 15 రోజులుగా కుమారుడు వంశీ ఇంట్లో ఉంటున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని కిందకు దించి చూడగా  అప్పటికే మృతి చెంది ఉన్నాడు. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు