వివాహిత ఆత్మహత్య

27 May, 2019 11:52 IST|Sakshi
నివేద (ఫైల్‌)

తమిళనాడు, వేలూరు: ఆంబూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రాజశేఖర్‌ మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆంబూరు సమీపంలోని పచ్చనపళ్లికి చెందిన కాశి కుమార్తె నివేద (24) వీరిద్దరూ గత ఆరు సంవత్సరాలుగా  ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు తిరస్కరించారు.

దీంతో ఐదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.  దంపతులకు నాలుగు సంవత్సరాల కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో శేఖర్‌ రెండు నెలల క్రితం ఆంబూరులోని కస్పా వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కుటుంబంతో కాపురం పెట్టాడు. ఇదిలా ఉండగా రాజశేఖర్‌కు గుడియాత్తంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్య నివేదకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. శనివారం సాయంత్రం కూడా ఘర్షణ జరిగింది. దీంతో విరక్తి చెందిన నివేద ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం నిద్రలేచి చూడగా నివేద మృతి చెంది ఉండటాన్ని గమనించిన రాజశేఖర్‌ ఆంబూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి రాజశేఖర్‌ వద్ద విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు