మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

3 Apr, 2019 12:30 IST|Sakshi
వీరరాఘవమ్మ మృతదేహం

పీఎం పాలెం(భీమిలి): పెళ్లై రెండేళ్లు గడవక మందే మనస్తాపంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రంపాలెం భరత్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ పి.సూర్యనారాయణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా బంటుబిల్లి గ్రామానికి చెందిన లుక్కా శ్రీనివాసరావుకు మచిలీపట్నం కొత్తపేటకు చెందిన వీరరాఘవమ్మతో (25) సుమారు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి 9 నెలల పాప ఉంది. శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

నెల రోజుల కిందట చంద్రంపాలెం భరత్‌నగర్‌లోని ఓ గ్రూపు హౌస్‌లో వీరు కాపురంపెట్టారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి భోజనాల సమయంలో భార్యాభర్తల నడుమ చిన్నపాటి వివాదం జరిగింది. దీన్ని అవమానంగా భావించిన వీరరాఘవమ్మ అందరూ నిద్రించిన తరువాత వేరే గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని వేలాడుతున్న భార్యను గమనించిన శ్రీనివాసరావు వెంటనే కిందకు దించి పోలీసులకకు విషయం తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు