బీచ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

7 May, 2019 11:52 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఆరిలోవ పోలీసులు

ఆరిలోవ(విశాఖ తూర్పు): సాగర్‌నగర్‌ దరి బీచ్‌లో గుర్తు తెలియని ఓ వివాహిత మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాగర్‌నగర్‌ దరి జూ సాగర్‌ గేటు ఎదురుగా బీచ్‌లో సోమవారం ఓ మహిళ మృతదేహం బయటపడింది. సముద్రం లోపలకు వెళ్లేవారిని రక్షించే గార్డులు నిరంతరం బీచ్‌లో తిరుగుతుంటారు. ఇందులో భాగంగా సామవారం సాయంత్రం అటుగా వెళ్లిన అప్పన్న ఒడ్డుకు చేరిన మృతదేహాన్ని గమనించి వెంటనే ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ అప్పారావు సిబ్బందితో అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై æగాయాలు లేవు. సమాచారం కోసం ఆమె వద్ద ఆధారం లభించలేదు. ఆమె వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

దీంతో నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఎక్కడైనా అదృశ్యం కేసు నమోదైతే వివరాలు సేకరించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మెడలో బంగారు పుస్తెలతాడు, కాళ్లకు మట్టిలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. శరీరంపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ఆమె ప్రమాదవశాత్తు సముద్రం అలలకు కొట్టుకుపోయిందా..?, లేదంటే ఏవైనా సమస్యలుతో ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వివరాలు తెలిస్తే గానీ అసలు విషయం చెప్పలేమని ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించి భద్రపరిచారు.

మరిన్ని వార్తలు